గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్హౌస్లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020