సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని అన్నారు. నియోజకవర్గంలో ఈరోజు గ్యాదరి బాల్ రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు. సిద్ధిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సాయం అందిందని చెప్పారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొందామని అన్నారు.