రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో యూరియా షాపులను ప్రతిరోజు ఉదయం తెరవాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రేపటి నుంచి శనగల కొనుగోలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు అధికారులు వహించాలని తెలిపారు. షాపింగ్ మాల్స్, కిరాణా, ఇతర దుకాణాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. నిత్యావసరాల కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.