తెలంగాణలో వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహా సముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున, ఈ నెల 27న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా గురు, శుక్ర, శనివారాల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంటుందని తెలిపింది. 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొంది.
ఇక, ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళా ఖాతంలో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వివరించింది. ప్రధానంగా ఆగ్నేయదిశ/తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఇలా ఉండగా తెలంగాణలో గురువారం పొడి వాతావరణం ఉంటుందని, శుక్రవారం తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పొగ మంచు కూడా ఉంటుందని తెలిపింది.కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్లోని వాతావరణ పరిశోధనా కేంద్రం పేర్కొంది.