కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఎప్పుడో జరిగిపోయిన రాష్ట్ర విభజన గురించి మంత్రి ఇప్పుడు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
రాత్రిళ్లు రాష్ట్ర విభజన చేశారని అవహేళన చేయడం మంత్రి స్థాయికి తగదన్నారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ జమ్ముకశ్మీర్కే వర్తిస్తుందనడం విడ్డూరమని విమర్శించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమమని, దీనిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.