telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాన్వీ కపూర్ కు షాకిచ్చిన ఐఏఎఫ్…!

GS

జాన్వీకపూర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నెటిజన్ల ముందుకు ఈ చిత్రం వచ్చింది. ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అయితే ఈ సినిమా విషయంలో జాన్వీకి తలనొప్పులు మొదలయ్యాయి. గుంజన్ సక్సేనా సినిమా మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. అంతేకాదు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఎయిర్ ఫోర్స్ మీద ఈ సినిమా నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. అలాగే లేఖను నెట్ ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్ హౌస్‌కు కూడా పంపింది. గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్ అనే సినిమాను తీస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని, అలాగే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా తీస్తామని చెప్పారని ఐఏఎఫ్ గుర్తు చేసింది. కానీ, ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే సినిమాను తాము కూడా చూశామన్నారు. తమకు కూడా అదే భావన కలిగిందంటూ రాసిన లేఖలో ఐఏఎఫ్ పేర్కొంది. గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌కి భారీ హైప్ తీసుకురావడం కోసం ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఐఏఎఫ్‌ మీద నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీసిందని అభ్యంతరం తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో లింగ భేదాన్ని చూపే సన్నివేశాలు ఉన్నాయని (ఎయిర్ ఫోర్స్ ఆఫీసులో మొదట్లో మగవారి టాయిలెట్స్ ఉండేవి. ఆమె లేడీస్ టాయిలెట్ కోసం వెతుకుతున్నట్టు ట్రైలర్‌లో సీన్‌, డైలాగ్ ఉన్నాయని అభిప్రాయపడింది. ఆ సన్నివేశాన్ని డిలీట్ చేయడమో లేకపోతే మార్చడమో చేయాలని సూచించింది. ఐఏఎఫ్ గురించి అవాస్తవాలు మాత్రం ప్రసారంచేయొద్దని స్పష్టం చేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్టమొదటి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ఆమె కూడా పాల్గొన్నారు. యుద్ధంలో కాల్పుల్లో గాయపడిన సైనికులను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే యుద్ధరంగంలో ఆమె చేసిన సేవలకు గాను శౌర్య వీర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

Related posts