రోడ్డు పక్కన చెత్త వేసిన కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి జరిమానా పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే… ఉదయం శంషాబాద్ మండలం నర్కుడ- షాబాద్ రహదారి పక్కన ఓ చెట్టు కింద చెత్తాచెదారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోసి వెళ్లిపోయారు. అనంతరం సర్పంచ్ సున్నిగంటి సిద్దులు, సెక్రటరీ శివప్రసాద్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సదరు చెత్తలో సరూర్నగర్లో ఉంటున్న మల్లారెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చెందిన ఐడీ కార్డు, చెక్కులు, ఇతర పత్రాలు లభించాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ జగన్మోహన్రావు వాటిని పరిశీలించారు.
నిబంధనల మేర అతన్ని పిలిపించి రూ.5వేలు జరిమానా వేశారు. దీంతో అతను తనకు తెలియదని తన డ్రైవర్ ఎప్పుడు వేశాడో తెలియదని వివరించాడు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించి పలు సమస్యపై చర్చించారు. కార్యక్రమంలో జగన్మోహన్రావు మాట్లాడుతూ స్వచ్ఛందంగా శ్రమదానంతో మన గ్రామాలను మన కోసం బాగుచేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యం, పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.