telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అసెంబ్లీకి నల్ల చొక్కాతో టీడీపీ ఎమ్మెల్యే… కారణం ఇదే…!

Buchaiah

ఏపీ అసెంబ్లీ ఏడో రోజు వాడీ-వేడిగా నడుస్తోంది. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభ.. అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నల్ల చొక్కాతో అసెంబ్లీకి వచ్చారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలంతా మామూలుగా వస్తే.. ఆయన మాత్రం ఇలా వినూత్నంగా నల్ల చొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. బుచ్చయ్య చౌదరి ఇలా నల్ల డ్రస్‌లో రావడంతో మిగిలిన సభ్యులు కారణం ఏంటని ఆరా తీశారట. సభ జరుగుతున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బుచ్చయ్య ఇలా అసెంబ్లీకి వచ్చారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పంచాయతీల నిధులకు సంబంధించిన అంశంపై ఆయన మాట్లాడారు. కానీ తాను మాట్లాడుతున్న సమయంలో అధికారపక్షం అడ్డు తగలడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూల్ ప్రకారం సభ నడిచే పరిస్థితి లేదన్నారు గోరంట్ల. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎత్తినా.. రూల్ గురించి పొజిషన్ చెబుదామన్నా.. అవకాశం ఇవ్వడం లేదు కనుక నిరసన తెలియజేయడానికి నల్ల చొక్కా వేసుకొచ్చానని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మనేని సీతారాం.. నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పంచాయతీలపై భారం పడిందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇసుక పాలసీ వల్ల ధర పెరిగిందని.. పంచాయతీలకు ఆదాయం లేదు.. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మంచినీరు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని.. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్నా పంచాయతీలకు నిధులు లేవన్నారు. వేస్ట్ మేనెజ్‌‌మెంట్ కూడా నిలిచిపోయిందని.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

Related posts