ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయం వద్ద సినీ, తెలుగు ప్రముఖులు అంజలి ఘటించారు. అనారోగ్యంతో గత గురువారం ఆయన కన్నుమూయగా.. మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో ఆదివారం అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని స్థానిక టి.నగర్ శారదాంబాళ్ వీధిలోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్ధం ఉంచారు.
నటులు భానుచందర్, చిరంజీవి, సుహాసిని, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాజీవ్మేనన్, సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తదితరులు గొల్లపూడి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు టి.నగర్ కన్నమ్మపేట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.