ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు వరుసగా 1.4 శాతం, 2.5 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం ఇందుకు కారణం. దేశీ మార్కెట్లో బంగారం ధర గత నెల గరిష్ట స్థాయి (రూ.39,885) నుంచి చూస్తే 10 గ్రాములకు ఏకంగా దాదాపు రూ.2,300 దిగొచ్చింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ఇటీవల గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా రూ.4,700 పతనమైంది.
ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.497 పతనమైంది. రూ.38,685కు దిగొచ్చింది.10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. వెండి ధర కూడా ఏకంగా రూ.1,580 తగ్గుదలతో రూ.47,235కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.4 శాతం పెరుగుదలతో 1,509 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి ధర 0.4 శాతం తగ్గుదలతో ఔన్స్కు 18.51 డాలర్లకు క్షీణించింది. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి, బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా, పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.