సెప్టెంబరు 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరిన కంగన.. తన మాటను నిలబెట్టుకుంటూ భారీ బందోబస్తు నడుమ దేశ వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టారు. అయితే కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనల కారణంగా ఆమె 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని బీఎంసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో కంగన దరఖాస్తు మేరకు ఆమెకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తాజాగా తెలిపింది. బుధవారం మహారాష్ట్రకు వచ్చిన బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్కు హోం క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చినట్లు బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి వెల్లడించారు. వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తాను ముంబై నుంచి వెళ్లిపోతానని కంగన, ఆన్లైన్ దరఖాస్తులో స్పష్టం చేశారని, కాబట్టి షార్ట్-టర్మ్ విజిటర్ కేటగిరీ కింద ఆమెకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 14న కంగన ముంబైని విడిచివెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.