పాఠశాల నుండే పాశవికత మొదలవుతుందా.. అంత చిన్న వయసు నుండే ఆ మనసులలోకి విషాన్ని ఎవరు జొప్పిస్తున్నారు.. జీవితాలను నాశనం చేసేంత కసి వాళ్లలో ఎందుకు నాటుకుంటుంది.. లాంటి ప్రశ్నలకు జవాబులు చాలా అవసరం. లేదంటే రేపటి పౌరుల చేతిలో దేశం ఇంకా నాశనం అవుతుంది తప్ప బాగుపడదు. వారిని తీర్చిదిద్దే వారు సరిగా లేకుంటే, వారు మాత్రం ఏవిధంగా సరైన మార్గంలో నడవటం అలవాటు చేసుకోగలరు. ముందు మనం సరైన దారిలో వెళ్తున్నామా అనే ప్రశ్నకు మనసాక్షిగా జవాబు చెప్పుకోగలిగితే .. ఆ పసి మనసులపై చీకటి మరకలు అంటవు. అలాంటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న పసితనం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం చేసింది. ప్రైవేటు పాఠశాల హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి బాలికపై అదే పాఠశాలలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి.. పూర్వ విద్యార్థితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత నెల 24నే ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందంటూ బాధిత బాలిక పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయం గురించి బయట ఎక్కడైనా చెబితే పది పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారు. దీనితో ఏం చేయాలో తోచని విద్యార్థిని పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అప్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక కాలు జారి కిందపడిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన స్కూలు యాజమాన్యం ఆమెకు కర్నూలు జిల్లాలో వైద్యం చేయించేందుకు ప్రయత్నించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.