మరో వారం రోజుల్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో శుభలేఖలు పంచి ఇంటికొచ్చిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో గతరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య (23) గజ్వేల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇంటి పై అంతస్తులో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
దివ్యకు ఇటీవల వరంగల్కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో దివ్య కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. దివ్య నిన్న బ్యాంకులోని తన సహోద్యోగులకు శుభలేఖలు పంచిపెట్టి ఇంటికి చేరుకుంది. సాయంత్రం కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఆమె పెద్దగా అరిచి కుప్పకూలిపోయింది. వారు వెంటనే ఆమె ఇంటికి వచ్చి చూసి చూసేసరికి రక్తపు మడుగులో దివ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని దివ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. 8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వెంకటేశం.. ఆ తర్వాత ప్రేమ పేరుతో వేధించాడని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మూడు రాజధానులనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు: యనమల