telugu navyamedia
క్రీడలు సామాజిక

స్వయంగా పనిమనిషి అంత్యక్రియలు జరిపిన గంభీర్…

లాక్ డౌన్ సమయంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మానవత్వం చాటుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే మహిళ చనిపోతే లాక్‌డౌన్ వేళ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి వారి కుటుంబానికి అండగా నిలిచాడు. ఒడిశాకి చెందిన సరస్వతి పాత్రా (49) గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పనిచేస్తోంది. సరస్వతి షుగర్, బీపీతో చాలా కాలంగా బాధపడుతోంది. ఏప్రిల్ 21 న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆవిడ మృతదేహాన్ని తన స్వస్థలం అయిన ఒడిశాకు పంపించలేకపోవడంతో తానే చివరి కార్యక్రమాలు పూర్తి చేసాడు గంభీర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసాడు. అందులో… “సరస్వతి పాత్రాని మేము ఎప్పుడూ పని మనిషిగా చూడలేదు. ఆమెని మా కుటుంబ సభ్యురాలిగానే చూశాం. అందుకే ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యతగా భావించా. కులమతాలకి అతీతంగా వ్యవహరించడమే హుందాతనం. అదే మెరుగైన సమాజాన్ని నిర్మించగలదు. నా దృష్టిలో అదే నిజమైన ఇండియా. ఓం శాంతి’’ అని గంభీర్ అన్నాడు. 2017 ఐపీఎల్ సీజన్‌ సమయంలో తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నక్సల్స్ దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాల సంరక్షణార్థం అందజేసిన విషయం తెలిసిందే. గౌతమ్ గంభీర్ ఉదారతను అంతా ప్రశంసిస్తున్నారు.

Related posts