టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2021 రిటెన్షన్ జాబితాలపై స్పందిస్తూ ఈ మాజీ కెప్టెన్ను గంభీర్ ఆకాశానికెత్తాడు. గత సీజన్లో దారుణ ప్రదర్శన కనబర్చిన చెన్నై పెద్దగా మార్పులు చేయలేదన్నాడు. ఇది ధోనీ ప్రత్యేకతని, అతను దేని గురించి మరి ఎక్కువగా ఆలోచించడని, అదే చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్కు కారణమని కొనియాడాడు. ఇక ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సిద్దమవుతున్న ఫ్రాంచైజీలు గత బుధవారం తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా.. సన్రైజర్స్ హైదరాబాద్ 22 మందిని అంటిపెట్టుకుంది. ఆర్సీబీ మినహా దాదాపు అన్ని ఫ్రాంచైజీలు స్వల్ప మార్పులే చేశాయి. గత సీజన్లో దారుణ ప్రదర్శన కనబర్చిన సీఎస్కే కూడా కేవలం ఐదుగురు ఆటగాళ్లనే వదులుకుంది. ఈ విషయాన్నే ప్రస్తావించిన గంభీర్.. సీఎస్కే నిర్ణయాన్ని కొనియాడుతూ.. ఆర్సీబీ తీరును తప్పుబట్టాడు.
భారీ మార్పులు చేయకుండా చెన్నై సూపర్ కింగ్స్ సరైన వ్యూహాన్ని అమలు చేసిందని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. ధోనీ ఎప్పుడూ దేని గురించి ఎక్కువగా ఆలోచించడని, ప్రస్తుతంలోనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఈ బ్యాలెన్స్డ్ మైండే వారికి సక్సెస్కు కారణమన్నాడు. ‘ఇదే ధోనీ ప్రత్యేకత. ధోనీ ఎప్పుడూ దేని గురించి ఎక్కువగా ఆలోచించడు. పర్టిక్యులర్ సీజన్ కోసం మాత్రమే జట్టు నిర్మాణంపై వ్యూహాలు రచిస్తాడు. ఇదే ఆర్సీబీ, సీఎస్కేకు ఉన్న తేడా. సీఎస్కే చెత్త ప్రదర్శన కనబర్చిందని, జట్టు మొత్తం మార్చాల్సిన అవసరం ఉందని చాలా మంది అన్నారు. కానీ వాళ్లు మాత్రం కేవలం ఐదుగురిని మాత్రమే వదులుకున్నారు. మరోవైపు ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్ చేరి కూడా పది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. పేలవ సీజన్ తర్వాత కూడా సీఎస్కే ఆటగాళ్లపై విశ్వాసం కనబరుస్తూ మద్దతుగా నిలిచింది. ఇది జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ప్రొఫెషనలిజాన్ని కూడా చూస్తుంది. ఈ తరహా ధోనీ గైడెన్స్తోనే ఐపీఎల్లో ఇన్నాళ్లు చెన్నై సక్సెస్ అయింది. మానసిక సమతూల్యంతో ఆటగాళ్లకు ఇచ్చిన భద్రత కారణంగానే చెన్నై విజయాలు సాధించింది. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లే కాదు.. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవారిపై కూడా ఇదే విశ్వాసాన్ని కనబర్చింది.’అని గంభీర్ పేర్కొన్నాడు.

