గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు ధ్వంసమైన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చీమనపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఆర్.ఈశ్వర్రెడ్డి ఇంట ఉదయం వంట చేసి, సిలిండర్ రెగ్యులేటర్ ఆ ఫ్ చేయడం మరచారు. తలుపులు వేసుకుని పొలం పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకైంది. తలుపులన్నీ మూసి ఉండడంతో గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ప్రమాదానికి దారితీసింది. దీంతో పేలుడు తరహాలో ఆ ఇంట పెద్దపెట్టున శబ్దం వచ్చింది. దీని ధాటికి ఇంటి గోడలు, పైకప్పులతో సహా కూలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తులు ధ్వంసమయ్యాయి.
పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి గోడలు సైతం కూలిపోయాయి. ఒకరి ఇంటి ఆవరణలోని ద్విచక్రవాహనం సైతం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు హడలిపోయారు. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.