హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పిటిషనర్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని రేపటిలోగా వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11 కు వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది వినాయక చవితితో పాటు ఏ పండుగనూ వైభవంగా జరుపుకోలేకపోయాం. అయితే కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు జరపాలని హైదరాబాద్లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రణాళికను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 10 నుంచి ఉత్సవాలు మొదలవుతాయని సెప్టెంబర్ 19న గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 40 అడుగుల ఎత్తులో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు.