లారీ, రెండు కార్లు ఢీకొని నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. కడప శివారులోని గోటూరు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఎర్రచందనం తరలిస్తున్న సుమో… టిప్పర్ను ఢీ కొట్టగా.. ఆ వెంటనే మరో కారు కూడా వాటిని ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. టిప్పర్ డీజల్ ట్యాంక్ను సుమో ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంలోనే సజీవదహనం కాగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుల వివరాల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారిగా ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు.. ప్రమాదానికి గురైన మరో కారు కూడా స్మగ్లర్లదేనని గుర్తించారు. సరుకు తీసుకుని ముందు వెళుతున్న కారుకు ఈ వెహికల్ పైలెట్గా వచ్చినట్టు భావిస్తున్నారు. గాయపడిన ముగ్గురు కూడా తమిళనాడుకు చెందిన వారే కాగా.. వారిని చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పేర్లు ముని, మూర్తిగా గుర్తించారు అధికారులు.
previous post
కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్