మహారాష్ట్రలోని భివాండిలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బందిచర్యలు చేపడుతున్నారు. కాగా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు.
భవనానికి పగుళ్లు రావడంతో.. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై.. దాంట్లో నివాసముంటున్న 22 కుటుంబాలను శుక్రవారం రాత్రి ఖాళీ చేయించింది. అయితే తమ నివాసాల్లో కొన్ని వస్తువులు మరిచిపోయామని, అవి తీసుకువస్తామని ఐదుగురు వ్యక్తులు భవనంలోకి వెళ్లారు. ఈ సమయంలోనే భవనం కుప్పకూలిపోయింది. అనంతరం శిథిలాలను తొలగించి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ భవనాన్ని ఎనిమిదేళ్ల క్రితం నిర్మించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.