telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హత్యా రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు..

 ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడులో జాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయల్దేరిన  బుద్దావెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌న్న మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నార‌ని ఆరోపించారు. పల్నాడులో ముగ్గురు బీసి టీడీపీ కార్యకర్తలను హతమార్చారని, ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్షలు లేవ‌ని అన్నారు.

జల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించకూడదా? కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లింద‌ని అన్నారు.

బీసీ నాయకుల హత్యల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కుట్ర దారుడు అని ఆరోపించాడు..పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీ అల్లరి మూక దాడిలో చనిపోయిన జల్లయ్య మృతదేహానికి‌ నివాళి అర్పించడానికి మేము‌ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులను , ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారు. డీజీపీ ఆఫీసు నుంచి వస్తున్న ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు తప్ప.. శాంతిభద్రతలను ఏమాత్రం పట్టించుకోవడం లేద‌ని అన్నారు.

గతంలో మూడేళ్లు గౌతమ్ సవాంగ్ ను వాడుకుని పంపేశారని, రేపు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనని తెలుసుకోవాలని సూచించారు. ఎవరినైనా సీఎం జగన్.. యూజ్ అండ్ త్రో గానే చూస్తారని బుద్దా వెంకన్న అన్నారు.

టీడీపీ నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక.. సీఎం జగన్ ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు, నేతల హత్యలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు త్వరలోనే తరిమికొట్టి బుద్ధి చెబుతారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు

Related posts