బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. కరోనా కారణంగా మాజీ మంత్రి పి. మాణిక్యాలరావు మరణించారనే వార్త విని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణం రాజు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ‘‘కరోనా కారణంగా ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి శ్రీ పి. మాణిక్యాలరావుగారు మరణించారనే వార్త తెలిసి చాలా బాధేసింది. ఆయన దయా హృదయం కలవారు. సామాన్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన క్షమశిక్షణతో ఎదుగుతూ.. కీలకమైన పదవులను అధిరోహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలై అంచలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణవార్త వినగానే చాలా బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను..’’ అని తెలిపారు.