telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమలలో బాలుడి కిడ్నాప్ క‌ల‌కం : 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ..

తిరుమలలో బాలుడి కిడ్నాప్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే

కిడ్నాప్‌కు గురైన బాలుడి కుటుంబం తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటుంది. బాలుడి తండ్రి హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయానికి సమీపంలో భక్తుల నుదుటి గోవింద నామాలు పెడుతూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.

అయితే ఆదివారం స్వాతి తన పనిలో నిమగ్నమై ఉండగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం సమీపంలో ఉన్న బాలుడి వద్దకు ఓ మహిళ వచ్చి బాలుడితో కాసేపు గడిపింది. ఆమె బాలుడికి కొన్ని స్వీట్లు అందించింది. సాయంత్రం 5.15 గంటలకు బాలుడిని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది.

సాయంత్రం 5.45 గంటలకు కొడుకు కనిపించడంతో స్వాతి గుడి చుట్టుపక్కల వెతికింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజి ఆధారంగా దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి.

కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్లు భావిస్తున్నారు పోలీసులు. బాలుడి ఆచూకీ కోసం నెల్లూరు,కడపకు ప్రత్యేక పోలిస్ బృందాలు బయలుదేరాయి. ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి తిరుపతికి పారిపోయిందని తెలుస్తోంది.

అనంతరం మహిళ తిరుపతిలో ఏపీ03 జెడ్ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరికైనా బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు0

Related posts