తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫలితాల అనంతరం అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది.
మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. ఓటర్లు ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జజ్జరెల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్లో ఒక సర్పంచ్ అభ్యర్థి పేరు గల్లంతు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఆరుగురు అభ్యర్థులకు గాను… పోలింగ్ సిబ్బంది ఐదుగురు అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ ఇచ్చింది. దీంతో గ్రామస్థుల ఆందోళన చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది.