telugu navyamedia
తెలంగాణ వార్తలు

పారిశ్రామిక రంగంలోని మహిళలకు వీలైనంత సాయపడాలి: కవిత

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) నాలుగో స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐఏఎస్ కరుణ వాకాటి, పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ వినోభా దేవికి స్త్రీ రత్న అవార్డు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుష్పలతా దేవికి స్త్రీ మూర్తి అవార్డు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనూషకు స్త్రీ శక్తి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఒక మహిళకు అవార్డు ఇచ్చామంటే, ఆ మహిళను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. వాడవాడలా బతుకమ్మ జరుపుతూ స్త్రీని దేవతగా పూజించే పవిత్రమైన నవరాత్రి సమయంలో స్త్రీ శక్తి అవార్డు ఇవ్వడం సంతోషకరంగా ఉందని కవిత తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరుకోట్ల మంది పారిశ్రామికవేత్తలు సూక్ష్మ‌, మ‌ధ్యతరగతి పరిశ్రమలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇందులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యంలో నడుస్తున్నాయన్నారు. ఈ 15 శాతంలో 80 శాతం మహిళలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా మిగిలిన 20 శాతం మంది ప్రైవేటు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పరిశ్రమలు నిర్వహిస్తున్నారని వివరించారు. పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టిన మహిళలు, ఔత్సాహిక మహిళలకు వీలైనంత సాయపడాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు అన్ని రకాలుగా సలహాలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మహిళా పారిశ్రామిక వేత్తలను ఎమ్మెల్సీ కవిత కోరారు. అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్‌కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళ డా. శాంతికుమారిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కలిసి కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అవార్డు వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.

Related posts