ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల(36) ఆత్మహత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులో పలు కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే..
డిజైనర్ ప్రత్యూష చనిపోయేందుకు 10 రోజులు ముందే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నొప్పి లేకుండా ఎలా చనిపోవాలని ఆమె ఇంటర్నెట్ లో వెతికినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు అంతా ఉంటారు కాబట్టి, బొటిక్లో ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలుస్తోంది.
వారం క్రితం కార్పెంటర్ను పిలిపించి బాద్ రూంలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని మూసివేయించినట్లు గుర్తించారు.అయితే, ఆమె ఫోనును కూడా పోలీసులు పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి పాస్వర్డ్ ఉండడంతో టెక్నాలజీ నిపుణుల సాయంతో దాన్ని ఓపెన్ చేయించి పరిశీలిస్తామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. మృతదేహం వద్ద లభించిన కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.
కొద్దికాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న ఆమెకు బయటపడే మార్గం కనిపించలేదని భావిస్తున్నారు. తరచూ స్నేహితులు, సన్నిహితులతో జీవితంపై నిరాశను వ్యక్తం చేసేదని.. తాను మానసిక ఘర్షణకు గురువుతోందనే విషయాన్ని వారు పసిగట్టలేకపోయారని తెలుసుకున్నారు. మొత్తానికి తాను కోరిన జీవితాన్ని ఇది కాదనే బాధతోనే చనిపోవాలని ప్రత్యూష నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బొటిక్ వాచ్మెన్ను అదుపులోకి తీసుకొని కొన్ని వివరాలు రాబట్టారు. ప్రత్యూష బొటిక్ వాచ్మెన్ రెండు నెలల క్రితం వీరబాబు, దుర్గా దంపతులు పనిలో చేరారు. వీరికోసం బొటిక్ ఉండే బిల్డింగ్ కింది భాగంలో ప్రత్యూష ఒక గదిని కేటాయించింది. శుక్రవారం ఉదయం 10, 11 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన ఆమె రెండుసార్లు బయటకు వెళ్లింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చింది.
తాను కిరాణా దుకాణానికి వెళ్తున్నానని ప్రత్యూషకు దుర్గా చెప్పగా.. పని ఉంటే తానే పిలుస్తాను అని… లోపలికి రావొద్దంటూ సూచించింది. ఉదయం తలుపు తీయకపోవడంతో రెండు సార్లు గట్టిగా తలుపు కొట్టినా తీయలేదని, 12 గంటల ప్రాంతంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చారని వీరబాబు, దుర్గ ఇప్పటికే పోలీసులకు తెలిపారు