ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 17 రోజులుగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, రద్దు మినహా సవరణలు చేసినా ఒప్పుకోబోమని అన్నారు. రైతు చట్టాలను రద్దు చేయకుంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని ఇప్పటికే రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. డిసెంబర్ 14 వ తేదీన ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. రాజస్తాన్ నుంచి రైతులు 200 ట్రాక్టర్లలో ఢిల్లీ శివారుకు చేరుకున్నారు. సోమవారం రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తామని, కేంద్రం దిగివచ్చి చట్టాలను రద్దు చేయాలని, ఒకవేళ చట్టాలను రద్దు చేయకుంటే, డిసెంబర్ 19 వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. అయితే, ఈరోజు ఫిక్కీ మీటింగ్ లో ప్రధాని మోడీ రైతు చట్టాలపై కొన్ని విషయాలు పేర్కొన్నారు. రైతు చట్టాల వలన రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అటు వ్యవసాయశాఖా మంత్రి తోమర్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఎక్కువ రోజులు ఆందోళనలు చేయడం సరికాదని, సామాన్యప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తోమర్ పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.