రైతు సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ నిజామాబాద్ ఎంపీ స్థానానికి జిల్లాకు చెందిన రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క స్థానంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ చర్చనీయాంశమైంది. తొలుత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న ఎన్నికల అధికారులు.. ఆ తర్వాత ఈవీఎంలు వినియోగించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న అభ్యర్థులు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మాత్రమే వినియోగించాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నామినేషన్లు వేసిన పసుపు రైతులంతా సోమవారం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో సమావేశమయ్యారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని రైతులు తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలకు కాకుండా రైతులకే ఓటు వేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను గెలిపిస్తే తాము అనుభవిస్తున్న సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.