ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇదే ఆసరగా తీసుకొని కొందరు దళారులు మోసాలకు పాలపడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బోటు బోల్తా ఘటనలో భార్య, కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తిని ముఖ్యమంత్రి పీఏనంటూ ఫోన్ చేసి ఓ ఆగంతకుడు మోసానికి పాల్పడ్డాడు.
విశాఖ వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు బొండా లక్ష్మి, పుష్ప బోటు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్కు శనివారం ఓ వ్యక్తి ఫోన్చేసి తాను అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని, బోటు ప్రమాద బాధితుల ఫోన్ నంబర్లు కావాలని కోరాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన క్రమంలో ఆ వ్యక్తికి జోనల్ కమిషనర్ బొండా లక్ష్మి భర్త శంకర్ ఫోన్ నంబర్ ఇచ్చారు.అనంతరం శంకర్కు 79890 97075 నంబరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను ముఖ్యమంత్రి జగన్ పీఏగా పరిచయం చేసుకున్నాడు.
రూ.17 లక్షలు పరిహారం వస్తుందని, అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ చెప్పాలని కోరా డు. ఆ డబ్బులు అందాలంటే తమ అకౌంట్లో రూ.7, 200 వేయాలని సూచించాడు. సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు భావించిన శంకర్.. ఖాతా వివరాలు చెప్పడమే కాకుండా వెంటనే వేపగుంట ఎస్బీఐలో అకౌంట్ నంబరు 36321029951లో నగదు డిపాజిట్ చేశాడు. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబరుకు ఫోన్ చేయగా పనిచేయలేదు. అనంతరం రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా తమకు తెలియదని చెప్పడంతో శంకర్ ఖంగుతిన్నాడు. వెంటనే జరిగిన మోసం పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.