ఏపీలోని చిత్తూర్ జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కుప్పంలో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు కోట్ల డెబ్భై లక్షల ఇరవై రెండువేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కొందరు వ్యక్తులు కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి చేస్తున్నారు. వీరిలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లికి చెందిన ఇంటి యజమానితో పాటు తిరుపతికి చెందిన మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్ష రూపాయాల నకిలీ కరెన్సీని చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను చలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.