టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎస్ లు, రిటైర్డ్ ఐఏఎస్ లు చంద్రబాబుకు లేఖ రాశారు. కొత్త సీఎస్ గా నియమితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంకు తమ మద్దతు ప్రకటించారు. ఆయన పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ మాజీ అధికారులు తప్పుబట్టారు.
ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎస్ గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను ఈసీ బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నూతన సీఎస్ గా నియమించడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందిస్తూ, జగన్ కేసుల్లో సహనిందితుడ్ని తీసుకువచ్చి సీఎస్ గా నియమిస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల పట్ల రిటైర్డ్ ఐఏఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపైనా చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.