భాగ్యనగరం మరో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమానికి వేదిక అయ్యింది. యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు వేదికకానుంది. 22 యూరప్ దేశాలకు చెందిన 22 సినిమాలు నగరంలో ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈనెల 21 నుంచి 31 వరకు అమీర్పేటలోని సారథి స్టూడియోలో ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, తెలంగాణ టూరిజం, యూరోపియన్ ఎంబసీ, భారత సమాచార మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది.
ఈమేరకు ఫిలింనగర్లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్హాల్లో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కల్యాణ్, రచయిత, దర్శకుడు పరచూరి వెంకటేశ్వరరావు ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. సినిమానే లైఫ్గా బతికే వారికి ఈ ఫెస్టివల్ ఒక గైడ్గా నిలవనుంది. ఎలాంటి సినిమాలు చేయాలి? స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి? సన్నివేశాలు ఎలా పండించాలి? మొత్తంగా ప్రపంచ సినిమా ఎలా ఉంటుంది? అందుకు మనం ఇంకేం చేయాలి? తదితర ప్రశ్నలకు ఈ ఫెస్టివల్లో సమాధానాలు దొరుకుతాయి. రోమాంటిక్ కామెడీ, డ్రామా, సెటైర్, ఫ్యామిలీ డ్రామా, సోషియో పొలిటికల్ థ్రిల్లర్ తదితర అంశాలను కథావస్తువుగా ఎంచుకుని దర్శకులు తీసిన గొప్ప సినిమాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు.