ఇప్పుడు హుజూరాబాద్లో ఉప ఎన్నిక పోరు ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయిలో ఈ ఉప ఎన్నికలు ఉన్నాయని అర్థమవుతోంది. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక కోసం గతంలో ఎన్నడూ జరగనన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ప్రచారం సాగుతున్నా కూడా ఇప్పుడు వ్యక్తుల మధ్య పోరులాగా మారిపోయింది. వ్యూహాత్మకంగానే హరీశ్రావుకు ఈ ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించిన కేసీఆర్ తన ప్లాన్ను బాగానే వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగానే ఇప్పుడు హరీశ్రావు అలాగే ఈటల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
నిజానికి వీరిద్దరూ కూడా ఒకప్పుడు మంచి స్నేహితులు. టీఆర్ ఎస్ లో ఉన్నంత కాలం వీరి హవా కొనసాగింది. ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ ఎదిగారు. ఇక ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ను వీడినప్పటి నుంచి హరీశ్రావు మీద కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఆయన వల్ల పార్టీలో ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఆయనకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం మళ్లీ మొదలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఈటల వెళ్లిపోయిన తర్వాత హరీశ్రావును అందలం ఎక్కిస్తున్నారు. ఇక హుజూరాబాద్కు కేటీఆర్ను దూరంగా పెట్టి హరీశ్రావు నెత్తిన బాధ్యతలు పెట్టారు. ఈ కారణంగా ఈటల కూడా హరీశ్రావు మీద భగ్గుమంటున్నారు.
హరీశ్రావు మీద వీలు చిక్కినప్పుడల్లా సంచలన కామెంట్లు చేస్తూ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న హరీశ్రావుకు దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరిన ఈటల.. నిన్న మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు హరీశ్రావు కుట్రలు చేశారని సెన్సేషనల్ కామెంట్లు చేశారు.
గత ఎన్నికల సమయంలో హరీశ్రావు తన మనుషులను గెలిపించుకునేందుకు పార్టీలకు అతీతంగా కొందరికి డబ్బులు పంపించారని, అందుకు తానే సాక్ష్యం అంటూ బాంబు పేల్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి త్వరలోనే హరీశ్రావు అసలు చరిత్ర ఏంటో బయటపెడుతానంటూ హెచ్చరించారు. దీంతో అసలు ఆయన ఏం బయటపెడుతారో అంటూ అంతా తలలు పట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టీఆర్ ఎస్లో ఈటల మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరి హరీశ్రావు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.