హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్.. గెలుపుపై స్పందించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలకు గురిచేసిననా.. దేనికీ లొంగకుండా భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీపేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తన గెలుపును హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అంకితం చేశారు ఈటల. హుజూరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తోలు వలిచి చెప్పులు కుట్టించినా నియోజకవర్గ ప్రజల రుణం తీరనిది అని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన పోటీలో.. చివరికి ఆత్మగౌరవమే గెలిచిందని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు.
ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, హుజూరాబాద్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు.
అన్నింటినీ పరిశీలించిన హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారాన్ని బొంద పెట్టారని అన్నారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. దేనికి లొంగకుండా.. గొప్ప తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడారు. ఎన్నో కష్టాలకు ఓర్చుకుని పనిచేసిన కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.”
ఎన్నికల నేపథ్యంలో తీసుకువచ్చిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే.. డబల్ బెడ్రూమ్ ఇల్లు సొంత భూమిలో కట్టుకోవడానికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో పెన్షన్లు ఇచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం అంతా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నాఉద్యమకారుడిగానే తన పోరాట పంథాను కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.