ఊహించని పరిణామాలు పెట్టుబడిదారులను ఖంగుతినిపించాయి. పావుగంట వ్యవధిలో ఐదులక్షల 19వేల కోట్లు ఆవిరైపోయాయి. దేశీయ మార్కెట్ విలవిల్లాడింది. ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ప్రకంపనలు… అంతర్జాతీయ పరిణామాలు.. ప్రభుత్వ నిర్ణయాలు స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లు కుప్పకూలాయి. తీవ్ర నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 16,600 పాయింట్లకు దిగువన ట్రేడ్ అవుతోంది.
స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో అన్నిరంగాల సూచీలు నష్టాలబాటపట్టాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియాల్టీ, లోహానికి సంబంధ సూచీలు కుదేలయ్యాయి.
మార్కెట్ ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ వెయ్యిపాయింట్లకు పైగా నష్టపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ పావుగంట వ్యవధిలో ఐదులక్షల 19వేల కోట్లు ఆవిరైపోయాయి.11 గంటల సమయానికి 1314 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్… 55,697 వద్ద కొనసాగింది. 395 పాయింట్లు కుంగిన నిఫ్టీ 16 వేల 589 పాయింట్లతో నెట్టుకొస్తోంది. అపరాల కమోడిటీ ట్రేడింగ్ ను సంవత్సరకాలంపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మార్కెట్ సూచీలను ముప్పుతిప్పలు పెట్టించిందని సమాచారం. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంది.