జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ కాలేజీల్లో ఫీజు కేవలం రూ.10 వేలుగా ఉందని, దీనిని రూ.20 వేలకు పెంచే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై ఆర్థికంగా భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫీజులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే ప్రతి లెక్చరర్ కూడా ఏటా ఫ్యాకల్టీ డెవల్పమెంట్ ప్రొగ్రాంకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా పద్ధతిలో మార్పులు తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు.