ఎంసెట్ అడ్మిషన్ కమిటీ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చేస్తూ నిర్ణయించింది. వెబ్ కౌన్సెలింగ్ను జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. జూలై 4న వెబ్ఆప్షన్లకు ఫ్రీజింగ్డేగా ప్రకటించారు. జూలై 6న ఎంసెట్ -2019 తొలి విడత సీట్ల కేటాయింపు చేపడుతారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజుల నిర్ణయం ఖరారుకాలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులకు ఏయే కాలేజీల్లో.. ఎంతెంత ఫీజులు ఉంటాయన్న వివరాలు ప్రస్తుతం ఎవరికీ తెలిసే అవకాశాలులేవు.
ట్యూషన్ఫీజులపై ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన కొన్ని యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ప్రైవేట్ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే వసూలుచేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకు సంబంధించిన కాపీ తమకు అందలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ తీర్పు ప్రతి రావడం, ట్యూషన్ఫీజులు ఖరారుచేసే ప్రక్రియ కొంత ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్కౌన్సెలింగ్ను వాయిదా వేయాల్సి వచ్చిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.