ఎన్నికల సంఘం (ఈసీ) లోక్సభ ఎన్నికల నిర్వహణ తేదీలను మార్చి మొదటి వారంలో ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ఈసారి ఎన్నికలు 9 దశల్లో జరిగే అవకాశం ఉంది. తేదీలను వచ్చే నెల 4 (మహా శివరాత్రి) తర్వాత ఎప్పుడైనా ఈసీ ప్రకటిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది.
ఈమేరకు ఈనెల 28లోగా అన్ని ప్రధాన నిర్ణయాలను అమలు చేయాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం తమకు సూచించినట్లు ఐదుగురు కేంద్ర మంత్రులు వెల్లడించారు. మార్చి 8 నాటికి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు వారు సంకేతాలిచ్చారు. దీంతో ఈ నెలాఖరు నాటికే పూర్తిచేసేలా.. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు భాజపాకు చెందిన కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు.