సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. లేని యెడల ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు. ఒక్క నగదుకే ఆధారాలు తప్పనిసరి కాదు. బంగారం, వెండి కొనుగోలు చేసి తరలించిన పక్కా రశీదులు పొందాలి. ఒక వేళ కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించినా దానికి సంబంధించిన పత్రాలను వెంటనే ఉంచుకోవాలి. ఇక ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్తుంటారు. ఇలాంటి వారు సైతం రోగి అడ్మిట్ అయిన ఆస్పత్రి రశీదులు చూపిస్తే సరిపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.