కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ ప్రధాన కంపెనీలు తమ వంటనూనె ఎమ్ఆర్పీపై రూ. 30-40 తగ్గించినట్లు స్పష్టం చేశాయి ఈ మేరకు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రధాన బ్రాండ్లు ఇవే….
అదానీ విల్మార్ (ఫార్చ్యూన్ బ్రాండ్), రుచి సోయ( మహాకోష్, సన్రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా బ్రాండ్స్), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్), బంగే(డాల్డా, గగన్, ఛంబల్ బ్రాండ్స్), జెమిని(ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్), సీఓఎఫ్సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్లు)తో పాటు ఇతర బ్రాండ్లు కూడా వంట నూనె ధరలు తగ్గించాయి.
అంతర్జాతీయంగా అధిక ధరల మధ్య, ప్రభుత్వ జోక్యంతో భారతదేశంలో ఆహార చమురు ధరలు స్థిరంగా తగ్గుతున్నాయని, రబీ సీజన్ నుండి మంచి ఆవాలు పంట రాకతో మరింత తగ్గుదల ఉంటుందని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే గురువారం తెలిపారు.
ఈ క్రమంలో వంట నూనెల ధరల తగ్గింపుపై ప్రధాన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా కంపెనీలు ఇటీవలే ప్రకటించాయి.