మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న దిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 6నే హాజరుకావాలని ఈడీ సూచించింది. అయితే కొన్ని కారణాల రీత్యా తాను ఆ రోజు హాజరుకాలేనని, విచారణను మరో రోజుకు మార్చాలని చందాకొచ్చర్ కోరారు. ఇందుకు అంగీకరించిన ఈడీ.. వచ్చే సోమవారం దర్యాప్తునకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలోనూ చందా కొచ్చర్ దంపతులు దర్యాప్తునకు హాజరైన విషయం తెలిసిందే. మే 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు కొచ్చర్ దంపతులను సుదీర్ఘంగా ప్రశ్నించారు.
అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్నకు చెందిన వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో వారిని విచారించారు. వీడియోకాన్ గ్రూప్ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో వారిపై మనీ లాండరింగ్ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.