టాలీవుడ్ డ్రగ్ కేసు, మనీలాండరింగ్ కేసులో హీరో రానా దగ్గుబాటి విచారణ ముగిసింది. ఇవాళ రానా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు నటుడు రానా దగ్గుబాటి హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 7గంటలకు ఈ విచారణ కొనసాగింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో లావాదేవీల గురించి రానాను ఈడీ అధికారులు ప్రశ్నించగా.. కెల్విన్ ఎవరో తనకు తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో మనీ లాండరింగ్ కోణంలో 2015 నుంచి 2017వరకు రానా బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు.
ఎఫ్ క్లబ్ కేసులోనూ రానాను పలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పూరీ, ఛార్మి, రకుల్, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.
సినీ తారల బ్యాంక్ ఖాతాల నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీశాన్ల ఖాతాలకు మధ్య లావాదేవీలు జరిగినట్టు కూడా తేలింది. వీటి ఆధారంగా డ్రగ్స్ కేస్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. ఇందుకోసం కీలక సూత్రధారి అయిన పెడ్లర్ కెల్విన్ తమ అదుపులోకి తీసుకుంది.