టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ చట్టం కింద టాలీవుడ్లోని 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు తన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ను కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీసినట్టు సమాచారం. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది.
పూరీ జగన్నాథ్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్న సమయంలో నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు బండ్ల గణేష్ను కార్యాలయానికి పిలిపించారు. ఈ వ్యవహారంలో ఆయన్ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని బండ్ల గణేష్ ధ్రువీకరించలేదు. పూరీని కలవడానికి మాత్రమే వచ్చానని మీడియా ముందు బండ్ల గణేష్ వెల్లడించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా రెండు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.