ఎన్నికల సంఘం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితంపై ప్రసారమవుతున్న వెబ్ సిరీస్పై స్టే విధించింది. ఆ సిరీస్ను ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ఎరోస్ నౌ ఛానల్కు ఆదేశాలు జారీ చేసింది. ‘మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేస్తూ ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మోదీ-జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ పేరుతో ఉన్న వెబ్ సిరీస్కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కానీ ఎరోస్ నౌ ఛానల్ ఈ సిరీస్ నుంచి ఇప్పటికే ఐదు ఎపిసోడ్లను ప్రసారం చేసింది. ఈ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలి, ఈ సిరీస్కు సంబంధించిన మొత్తం కంటెంట్ను మీ ప్లాట్ఫాం నుంచి తొలగించాలి’ అని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
బాలీవుడ్లో ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా పీఎం నరేంద్రమోదీ పేరుతో బయోపిక్ తెరకెక్కింది. ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సినిమా విడుదలపై ఈసీ నిషేధం విధించింది. ఈ వ్యవహారం తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ముందు ఈసీ అధికారులు సినిమాను చూసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ఎన్నికల అధికారులు సినిమా చూశారు. దీనిపై తమ అభిప్రాయాన్ని ఈసీ సోమవారం వెల్లడించే అవకాశముంది.