నిన్నటితో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు నేతలందరూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇదే అదును అన్నట్టుగా నకిలీ ఓటర్లు విజృంభించకుండా, అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం కాస్మొటిక్ చేతి వేళ్లపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో కొందరు వీటిని ఉపయోగించే అవకాశం ఉందన్న వార్తలతో అప్రమత్తమైంది.
సాధారణంగా ఈ కాస్మొటిక్ చేతి వేళ్లను ప్రమాదాల్లో వేలు పోగొట్టుకున్న వారు వాడుతుంటారు. ఇవి అచ్చం నిజమైన వేళ్లలానే ఉంటాయి. గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు వీటిని ఈ ఎన్నికల్లో ఉపయోగించుకోవడం ద్వారా దొంగ ఓట్లు వేసే అవకాశం ఉండడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. వీటిని ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్తే సిరా గుర్తును వాటిపైనే వేస్తారు. బయటకు వచ్చాక దానిని తొలగించి మరోసారి ఓటు వేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ కాస్మొటిక్ వేళ్ల గురించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు సిరాగుర్తు వేసే ముందు వేళ్లను గట్టిగా పట్టుకుని స్పష్టంగా పరిశీలించి వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా