హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ప్రజలకు బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది.
అంతేకాదు..మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, యూపీ ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈ నెల 16న నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం… ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. కానీ, ఇప్పటికీ రాజాసింగ్ స్పందించకపోవడంతో.. కేసు నమోదుకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.