ఏపీలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలల్లో వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీలో భూముల రీసర్వే కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు.డెన్మార్క్ దేశంలో జరిగిన భూసర్వేను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించనున్నట్టు తెలిపారు.