కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఇక కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సినీ స్టార్లు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే హీరో, హీరోయిన్లు, నటులంతా ఇంటికే పరిమితమై తమలో దాగున్న మరిన్ని కళలు ప్రదర్శిస్తున్నారు. గార్డెనింగ్, వంటలు చేస్తూ కుటుంబ సభ్యులను ఖుషీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దుల్కర్.. తాజాగా చేతిపై సీతాకోకచిలుక టాటూ, గోళ్లకు రంగు.. సరికొత్త మేకప్తో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కూతురితో ఆడుకునేందుకు ఇలా చేతికి స్టిక్కర్ అంటించుకున్నానని.. ఈ క్రెడిట్ అంతా తన కూతురు మరియంకు ఇచ్చాడు. క్వారంటైన్ డాడీ చేసే పనులు ఇవేనంటూ.. నిజంగా మనం ఎవరమో తెలుసుకునేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. కాగా 2011లో అమల్తో దుల్కర్ వివాహం చెన్నైలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2017లో మరియం జన్మించింది. ఇక మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ దుల్కర్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నాడు.