telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్‌సీబీ నోటీసులు అందలేదంటున్న రకుల్

Rakul

హీరో సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసే క్రమంలో బాలీవుడ్‌ డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్‌ లింకులతో సంబంధమున్న 25 మంది పేర్లను రియా వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. తాజాగా దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటుంది రకుల్‌ ప్రీత్‌. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ప్రీత్‌ మేనేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు ఇంకా సమన్లు అందలేదని తెలిపారు. ఒక యాడ్‌ ఫిల్మ్‌ షూట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన రకుల్‌ బుధవారం రాత్రి ముంబై వెళ్లారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఎన్‌సీబీ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు. కాగా డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను కూడా ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మోడీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. విచారణకు వచ్చేందుకు మరికొంత సమయం కావాలని రకుల్ విజ్ఞప్తి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related posts