అమెరికా ప్రభుత్వం వివాదాస్పద వీసా విధానాన్ని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గింది. ఆన్లైన్ ద్వారా క్లాసులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని జూలై 6వ తేదీన అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు విద్యాసంస్థలు ఆన్లైన్ పాఠాలకు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఓ కీలక ఆదేశం జారీ చేసింది. ఆన్లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మరో 17 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.