అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో అనేక అంశాలను చేరుస్తున్నారు. తాజాగా పర్యావరణ అంశానికి కూడా తన అజెండాలో స్థానం కల్పించారు. అంతేకాదు, ఆ దిశగా కార్యాచరణకు కూడా ఉపక్రమించారు. సముద్ర గర్భ తవ్వకాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తనను మించిన పర్యావరణవేత్త మరొకరు లేరని స్వయంగా చెప్పుకున్నారు.
గతంలో మాజీ అధ్యక్షుడు థియొడర్ రూజ్ వెల్ట్ గొప్ప పర్యావరణవేత్తగా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయన తర్వాత మళ్లీ అంతటి పేరు తనకే వచ్చిందని కొందరు సెనేటర్లు తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థులు మాత్రం ఇది ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. పర్యావరణవేత్త అయితే పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు బయటికి వచ్చినట్టని దుయ్యబట్టారు.
.